భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ క్షేత్రస్థాయిలోనే కాకుండా డిజిటల్ వేదికలపై కూడా తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో ఆయన అధికారిక ఛానల్ 30 మిలియన్ల (3 కోట్లు) సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక రాజకీయ నేతగా మోదీ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ప్రపంచ వేదికపై ఇతర అగ్రదేశాల నేతలకు అందనంత ఎత్తులో ఆయన నిలిచారు.
ప్రపంచ నేతలపై మోదీ పైచేయి
యూట్యూబ్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతల జాబితాను పరిశీలిస్తే.. ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే మోదీకి ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండటం విశేషం. ఇది ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉన్న క్రేజ్ను, ఆయన ప్రసంగాలకు ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తోంది.
https://www.youtube.com/@NarendraModi
19 ఏళ్ల ప్రయాణం.. 33 వేల వీడియోలు
ప్రధాని మోదీ 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాంకేతికత ప్రాధాన్యతను గుర్తించి తన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. గత 19 ఏళ్లలో ఆయన సుమారు 33,000 కంటే ఎక్కువ వీడియోలను షేర్ చేశారు. ఇందులో ఆయన విదేశీ పర్యటనలు, మన్ కీ బాత్ కార్యక్రమాలు, ఎన్నికల ప్రసంగాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన వీడియోలు ఉన్నాయి. నిరంతరం అప్డేట్గా ఉంటూ ప్రజలతో నేరుగా మమేకమవ్వడమే ఆయన విజయ రహస్యమని డిజిటల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లోనూ 10 కోట్ల మార్కును దాటిన మోదీ
కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ మోదీ హవా కొనసాగుతోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును దాటింది. ఒక రాజకీయ నేతకు సోషల్ మీడియాలో ఇంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ ఇండియా నినాదాన్ని స్వయంగా పాటిస్తూ.. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడంలో మోదీ ముందంజలో ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa