ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కువ మందిని కంటే కాన్పు సమయంలో రూ.25 వేలు.. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 06:28 PM

జనాభా నిర్వహణ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గురువారం కీలక ప్రకటన చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సహకాలు అందజేస్తామని ప్రకటించారు. రెండు, అంతకంటే ఎక్కువ మందిని కంటే కాన్పు సమయంలో రూ.25 వేలు నగదు బహుమతి, ఆ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకూ ఉచిత విద్యను అందజేస్తామని, ఇది గేమ్‌ ఛేంజర్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు జనాభా నిర్వహణ గురించి చర్చిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా పాలసీ రూపొందిస్తున్నట్టు తెలిపిన సీఎం.. నెల రోజుల పాటు చర్చ జరిపి, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది రూపు ఇస్తామని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 6.70 లక్షల జననాలు నమోదవుతున్నాయని తెలిపారు. 2047 నాటికి ఏపీలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయిందని, 2.1 శాతంగా ఉంటేనే సుస్థిర ప్రగతి సాధ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.


సంతానలేమితో బాధపడేవారిని ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వీరి కోసం మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టి.. సబ్సిడీ ద్వారా పీపీపీ విధానంలో ఐవీఎఫ్ సేవలు అందించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు. అలాగే, సీజేరియన్లను తగ్గించడం, 8.8 శాతంగా ఉన్న టీనేజీ గర్భధారణలను 3 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.


‘‘1997లో ఆంధ్రప్రదేశ్‌లో జనాభా విధానం అమల్లోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో 1992 నాటికి సంతానోత్పత్తి రేటు 3 ఉండగా ఇప్పుడు 1.5కు దిగిపోయింది.. ప్రస్తుతం దక్షిణాదిలోనే ఈ రేటు తక్కువగా ఉంది. తమిళనాడులో 1.4, కేరళలో 1.6 శాతం ఉండగా.. బిహార్‌లో 3 శాతంగా ఉంది.. రాష్ట్రంలో 57 శాతం మంది ఒక్క బిడ్డతోనే ఆపేస్తున్నారు.. 32 శాతం మంది ఇద్దర్ని కంటే.. కేవలం 9 శాతం మంది మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కంటున్నారు. రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లుపైబడిన వారు 10 శాతం మంది ఉండగా.. 2047 నాటికి వీరి సంఖ్య 23 శాతానికి చేరుతుంది.


ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విధానం అమలు చేస్తాం. జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. టీఆర్‌ఎఫ్‌ను 2.1కు తీసుకెళ్లడం మన లక్ష్యం. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రోత్సహాకాలు అందజేస్తాం.. ఇద్దరు లేదా అంతకు మించి కంటే కాన్పు సమయంలో రూ.25వేలు ఇస్తాం.. మూడో సంతానానికి 18 ఏళ్లు వచ్చే వరకూ ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంతానోత్పత్తి తగ్గితే పని చేసే వయస్సు జనాభా గణనీయంగా తగ్గి, ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa