రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ శకం బిహార్లో ముగియనుంది. ఆయన రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే, నితీష్ కుమార్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి, పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగు నెలల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ పెను మార్పునకు కారణాలను వివరిస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ ఉభయ సభలలో సభ్యుడిగా ఉండాలనే కోరిక తనకు చాలా కాలంగా ఉందని అన్నారు. ఇప్పటికే లోక్సభ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశానని, రాజ్యసభ పదవితో ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పడం గమనార్హం.
‘‘రెండు దశాబ్దాలకు పైగా, మీ నమ్మకాన్ని, మద్దతును నిరంతరం నిలబెట్టుకున్నాను.. మీరు ఇచ్చిన బలం ద్వారానే బిహార్కు, మీ అందరికీ పూర్తి విధేయతతో సేవ చేయగలిగాను. మీ విశ్వాసం, మద్దతు కారణంగానే బీహార్ నేడు అభివృద్ధి, గౌరవంలో కొత్త కోణాన్ని స్వీకరిస్తోంది. దీనికి నేను గతంలో చాలాసార్లు మీకు నా కృతజ్ఞతలు తెలియశాను... నా పార్లమెంటరీ జీవితం ప్రారంభం నుంచి బిహార్ శాసనసభ, పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిని కావాలని కోరుకున్నాను. లోక్సభ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యాను.. ఈ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిని కావాలని కోరుకుంటున్నాను’’ అని నితీష్ కుమార్ అన్నారు.
‘‘మీతో ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది.. అభివృద్ధి చెందిన బీహార్ నిర్మాణం కోసం కలిసి పనిచేయడానికి నా నిబద్ధత ఎప్పుడూ ఉంటుందని నేను మీకు హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నాను.. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు, సహకారం, మార్గదర్శకత్వం ఉంటుంది’’ అని బిహార్ సీఎం స్పష్టం చేశారు.
జేడీయూ నాయకులు మాత్రం ఆయన బీహార్ రాజకీయాలలో కొనసాగాలని కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా బిహార్ రాజకీయాల్లో మూడు స్తంభాలుగా నిలిచిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, దివంగత సుశీల్ మోదీ ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళన సమయంలో కలిసి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ కూడా అలాగే చేశారు. నితీష్ కుమార్ తప్ప, ఈ నాయకులందరూ రాజ్యసభలో పనిచేశారు.
నితీష్ కుమార్ అసెంబ్లీ, శాసన మండలి, లోక్సభ సభ్యుడు, కానీ రాజ్యసభ సభ్యుడు కాదు. తాజాగా రాజ్యసభకు ఎన్నికానుండటంతో లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీల అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా, బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది చర్చనీయాంశమవుతోంది. నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం ఖాయమని, ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని తెలుస్తోంది. సీఎం పదవి బీజేపీకి దక్కబోతుంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధురి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa