పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి మూతపడటంతో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు ధరల పెరుగుదలపై తమకేమీ ఆందోళన లేదని.. పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వద్ద చమురు నిధి..
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. పెట్రోల్, డీజిల్ ధరల ఒత్తిడిని తగ్గించడానికి తమ ప్రభుత్వం వద్ద తగినన్ని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. "మా దేశంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. యుద్ధం వల్ల తలెత్తిన ఈ సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత నెల చివరి నాటికి అమెరికా వద్ద దాదాపు 415 మిలియన్ బారెళ్ల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, అత్యవసరమైతే వాటిని వినియోగిస్తామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
భారత్కు 30 రోజుల 'స్పెషల్' గడువు
అంతేకాకుండా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లిన నేపథ్యంలో.. భారత్కు అమెరికా స్వల్ప ఉపశమనం కలిగించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత రిఫైనరీలకు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తాజాగా ట్రంప్ గుర్తు చేస్తూ.. ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న చమురు రవాణాకు మాత్రమే ఇది వర్తిస్తుందని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, భవిష్యత్తులో భారత్ అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గతంలో రష్యా నుంచి చమురు కొన్నందుకు భారత్పై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించుకుంటే ఈ టారిఫ్ ఎత్తివేసేందుకు అమెరికా అంగీకరించింది. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1000 మందికి పైగా, ఇజ్రాయెల్లో డజను మందికి పైగా మరణించారు. ఆరుగురు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటం వల్లే తాము ముందస్తు దాడులు చేశామని ట్రంప్ సమర్థించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa