ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించేందుకు,,, మృత్యువుతో పోరాడిన దీపికా అధానా

national |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 07:18 PM

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. తన ప్రాణాలకు తెగించి మాతృభూమి కోసం నిలబడింది ఒక 23 ఏళ్ల పైలెట్. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తుండగా... గగనతలం ప్రమాదకరంగా మారింది. ఈక్రమంలోనే యూఏఈలో చిక్కుకుపోయిన 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చి వార్తల్లో నిలిచారు ఫరీదాబాద్‌కు చెందిన పైలట్ దీపికా అధానా. అయితే ఆమె ఈ రెస్య్కూ ఆపరేషన్ చేపట్టడానికి ముందు తన తల్లికి చేసిన మెసేజ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


తిరిగొస్తానో లేదో కూడా తెలియదంటూనే వెళ్లి..


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల దీపికకు మార్చి 6వ తేదీ ఉదయం 10.15 గంటలకు హఠాత్తుగా ఒక పిలుపు వచ్చింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు వెళ్లి అక్కడ చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చాలని పైఅధికారులు సూచించారు. అయితే నిజానికి ఆ విమానాన్ని ఆమె స్నేహితురాలు నడపాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆ బాధ్యత దీపికపై పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న ప్రాంతం కావడంతో.. బయలుదేరే ముందు ఆమె తన తల్లితో అన్న మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. "అమ్మా.. బై బై. నేను తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు" అని చెప్పి ఆమె విమానం ఎక్కారు.


 కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సిబ్బందితో ఈ విమానం రాస్ అల్ ఖైమా చేరుకుంది. అయితే తిరుగు ప్రయాణంలో ఒక భయంకరమైన క్షణం ఎదురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. నెట్‌వర్క్ వైఫల్యంతో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో కూడా ధైర్యం కోల్పోకుండా దీపికా బృందం విమానాన్ని నడిపింది. కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ కమ్యూనికేషన్ పునరుద్ధరించబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా అనేక సవాళ్ల మధ్యే 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. వచ్చిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి సురక్షితంగానే ఇండియా చేరుకున్నట్లు చెప్పగా.. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు అంతా తెగ సంబురపడిపోయారు. ముఖ్యంగా ఆమె తల్లి బాబ్లీ అధానా మాట్లాడుతూ "నా బిడ్డ ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు చాలా గర్వంగా ఉంది" అని మురిసిపోయారు.


తాతయ్య కలకు ప్రాణం పోసి.. పైలెట్‌గా మారిన దీపిక


ఫరీదాబాద్‌లోని తిగావ్ ప్రాంతానికి చెందిన దీపికా తండ్రి యోగేశ్ అధానా ఒక ఆర్కిటెక్ట్. తన మనవరాలిని పైలట్‌గా చూడాలన్నది ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా చిరకాల కోరిక. 2020లో ఇంటర్ పూర్తి చేసిన దీపిక.. కోవిడ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటి నుంచే చదువుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. ఆ తర్వాత గ్రీస్, ఇస్తాంబుల్‌లో శిక్షణ పొంది ఎయిర్ బస్ A320 విమానాలను నడపడంలో నైపుణ్యం సంపాదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa