ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలయజ్ఞానికే మొదటి ప్రాధాన్యత...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 09:57 PM

రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితి గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమిని తడిపాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరు పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. 
ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నారు. దీంతో రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు. ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై సీఎం ఆరా తీశారు. 
ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న నీటిపారుదల పనులకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను అధికారులు సీఎంకు అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు.
నీటిపారుదల కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారాన్ని కోరారు. వరదజలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతిపాదనలు సిద్దంచేసి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు.
అలాగే ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆ మేరకు అంచనాలను రూపొందించాలని సూచించారు. ఈ నివేదిక ఆధారంగానే నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.
ఖర్చుచేసిన ప్రతి పైసాకు తగిన ఫలితం వచ్చేలా ఉండాలని ఆదేశించారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలావరకు జలయజ్ఞం పనులు పెండింగులో ఉండిపోతున్నాయన్న అధికారులు సీఎంకు వివరించారు. వీటిని మొదట ప్రాధాన్యతా క్రమంలో చేర్చి వెంటనే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని...ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa