కర్ణాటక జట్టు అరుదైన రికార్డుని సాధించింది. శుక్రవారం ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా 15 టీ20లు గెలిచి జట్టుగా కర్ణాటక జట్టు చరిత్ర సృష్టించింది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్-ఎ మ్యాచ్లో భాగంగా శుక్రవారం కర్ణాటక-ఉత్తరాఖండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ శ్రీవాస్తవ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహన్ కదమ్(67 నాటౌట్, 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు ), దేవ్దత్ పడిక్కల్(33 బంతుల్లో 53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కర్ణాటక అలవోక విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో కర్ణాటక జట్టు భారత్లో వరుసగా అత్యధిక టీ20లు గెలిచిన జట్టుగా అవతరించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్కి చెందిన ఒటాగో జట్టు ఇంతకముందే 15 విజయాలతో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ రెండింటి కంటే ముందు పాకిస్థాన్కు చెందిన సియల్కోట్ స్టాలియన్స్ వరుసగా 25 టీ20లు గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ టీ20 కప్ సందర్భంగా 2006-2010 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa