ఇటీవల సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభావితమైన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దు అయిన టికెట్ల నష్టపరిహారంగా గరిష్ఠంగా రూ.10,000 విలువ చేసే ట్రావెల్ వోచర్స్ను అందించాలని సంస్థ నిర్ణయించింది. ఈ వోచర్ల పంపిణీ ప్రక్రియను ఈ నెల డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై కేంద్ర ఏవియేషన్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే వారికి వోచర్లు అందజేయాలని ఇండిగోను ఆదేశించింది. వినియోగదారుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, పారదర్శకమైన విధానంలో ఈ పరిహారాన్ని పంపిణీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు త్వరితగతిన సేవలు అందించేందుకు సిద్ధమైంది.
నేరుగా ఇండిగో అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వెబ్సైట్ కస్టమర్ల వివరాలు ఇప్పటికే సంస్థ వద్ద ఉండటంతో, వారికి వారం రోజుల్లోపే వోచర్లు అందజేస్తామని సంస్థ తెలిపింది. ఇకపోతే, వివిధ ట్రావెల్ ఏజెన్సీలు లేదా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సమాచారం సేకరిస్తున్నారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ వారి వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే వారికి కూడా వోచర్లు జారీ చేయనున్నారు.
అయితే, ఈ వోచర్లు కేవలం పరిమిత కాలానికి చెందిన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయని సమాచారం. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ మధ్య విమాన ప్రయాణాలు పెట్టుకొని, సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బంది పడ్డ వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది. ఈ వోచర్లను ప్రయాణికులు భవిష్యత్తులో తమ తదుపరి ప్రయాణాల కోసం వినియోగించుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు జరిగిన ఆర్థిక నష్టాన్ని కొంత మేర పూడ్చవచ్చని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa