ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్‌ యాత్రలో ఇద్దరు తెలుగువారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2017, 08:34 AM

శ్రీనగర్‌, మాచారెడ్డి, న్యూస్‌టుడే: బస్సులో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తున్న ఇద్దరు తెలుగువారు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గురువారం కుల్గాం జిల్లా క్వాజీగుండ్‌ సమీపంలోని వీసు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న ఈ బస్సు 44 మంది యాత్రికులతో జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగ (పురుషుడు)గా గుర్తించారు. మరొకరు తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తి అని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందికి క్వాజీగుండ్‌లోని అత్యవసర ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మిగిలిన వారిని అనంతనాగ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో కలిసి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణమవుతుండగా గురువారం సాయంత్రం బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. కామారెడ్డికి చెందిన ఒకరు, మాచారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని బస్సులో ఉన్న విశ్వనాథం అనే యాత్రికుడు ‘న్యూస్‌టుడే’కు ఫోన్‌లో సమాచారం అందించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa