ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో పెరిగిన టిక్కెట్ ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2017, 12:10 PM

జీఎస్టీ పన్ను విధానం పుణ్యమాని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్ ధరలు పెరిగాయి. ఫలితంగా సినీ థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. పైగా, ఈ వారం ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాకపోవడంతో వీకెండ్‌ను తమ ఇళ్ళలోనే ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 1127 థియేటర్లు ఉన్నాయి. వీటిలో 6.14 లక్షో సీట్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వంద శాతం సీట్లు ఫుల్‌ అవుతుంటాయి. మిగిలిన రోజుల్లో 70 నుంచి 80 శాతం మేరకు ప్రేక్షకులు వస్తుంటారు. అయితే, దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు వారాంతాల్లో ఈ థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండేవి. కానీ, గత వారం రోజులుగా ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చివరకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా ఈ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. ఈనేపథ్యంలో జీఎస్టీతో పాటు వినోదపు పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్‌ యజమానులతో పాటు చలనచిత్ర వాణిజ్య మండలి ఆందోళనకు దిగింది. ఇందులోభాగంగా థియేటర్లను నాలుగు రోజుల పాటు మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సామరస్యపూర్వక ఫలితం రావడంతో థియేటర్లలో చిత్రాల ప్రదర్శనకు సమ్మతించారు. అదేసమయంలో టిక్కెట్‌ ధరను పెంచారు. రూ.100 టిక్కెట్‌ ధరను రూ.118గానూ, రూ.120 ధరను రూ.153గా పెంచారు. ఈ టిక్కెట్‌ ధరలను చూసిన ప్రేక్షకుడు బెంబేలెత్తిపోయి థియేటర్‌ వైపు వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఈ కారణంగా థియేటర్లు బోసిపోయి కనిపించాయి. ముఖ్యంగా వారాంతపు సెలవుల్లో కూడా థియేటర్లు ఫుల్‌ కాకపోవడంతో థియేటర్‌ యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa