ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ ప్రమాదంలో మృతులంతా భారతీయులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 13, 2017, 05:04 PM

సౌదీ అరేబియాలోని నజ్రాన్‌ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారంతా భారతీయులేనని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫైసలియా జిల్లాలోని ఓ ఇంట్లో నిన్న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడినట్లు సౌదీ వార్తా ఛానెళ్లు తెలిపాయి. మృతులంతా భారత్‌, బంగ్లాదేశ్‌లకు చెందినవారని వెల్లడించాయి. అయితే ఘటన గురించి తెలిసిన వెంటనే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.. రియాద్‌లోని భారత దౌత్యాధికారులను అప్రమత్తం చేశారు. అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.


దౌత్యాధికారులు గురువారం నజ్రాన్‌ వెళ్లి.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా.. చనిపోయిన వారంతా భారత్‌కు చెందినవారేనని విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. మృతుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నలుగురు, కేరళ నుంచి ముగ్గురు, బిహార్‌, తమిళనాడుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మరో ఇద్దరు మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియలేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఘటనలో బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa