లండన్: ఇండియాలోనే అతను వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.. వేల కోట్ల అప్పులు చేసి ఇండియన్ బ్యాంకులకే ఎగనామం పెట్టాడు.. అప్పు తిరిగి కట్టమంటే పారిపోయి లండన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఇక ఇండియాతో పనేముంది? ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇండియాను మిస్ అవుతున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. మిస్ అవడానికి ఇండియాలో ఏమీ లేదు అని సమాధానమిచ్చాడు విజయ్ మాల్యా. ఎన్నో కేసులు తనపై ఉన్నా.. అవేమీ పట్టనట్లు లండన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. హార్స్ రేస్లు, వింబుల్డన్, చాంపియన్స్ ట్రోఫీ, ఫార్ములా వన్ ఈవెంట్లంటూ తెగ తిరుగుతున్నాడు. బుధవారం ఓ ఎఫ్ 1 ఈవెంట్కు హాజరైన సందర్భంగా మాల్యా రాయ్టర్స్తో మాట్లాడాడు. నా కుటుంబమంతా ఇంగ్లండ్, అమెరికాల్లోనే ఉన్నారు. ఇండియాలో ఎవరూ లేరు. ఇక మిస్ అవడానికి ఏముంది అని మాల్యా అన్నాడు. మాల్యాను అప్పగించాలంటూ ఇండియా ఇప్పటికే యూకేను కోరగా.. అక్కడి కోర్టులో విచారణ కూడా జరుగుతున్నది. అయితే అవన్నీ నిరాధార ఆరోపణలే అని, కేసులు కొంతకాలం నడుస్తాయి అంటూ మాల్యా లైట్ తీసుకున్నాడు. నేనేమీ తప్పు చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరిపే యూకే కోర్టులో విచారణ జరగడం సంతోషంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దామంటూ మాల్యా ఇండియన్ కోర్టులను అవమానించే వ్యాఖ్యలు చేశారు. మాల్యా అప్పగింత కేసులో డిసెంబర్ 4 నుంచి రెండు వారాల పాటు పూర్తిస్థాయి విచారణ జరగనుంది. అప్పటి వరకు మాల్యా బ్రిటన్ వదిలి వెళ్లడానికి వీల్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa