ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 14, 2021, 09:28 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టెంపో డివైడర్‌ను దాటుకుని వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారితోపాటు 8 మంది మహిళలు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుంచి ఓ టెంపో ట్రావెలర్‌ అజ్మీర్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో ఉదయం 4.30 గంటల ప్రాంతంలో వెల్దుర్తి మండలం మాదార్‌పురం వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో టెంపోలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధితులు చిత్తూరు జిల్లా మదనపల్లె, అమ్మచెరువుమిట్ట, ఎన్టీఆర్‌ కూడలికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారని, మదనపల్లె నుంచి అజ్మీర్‌ దర్గా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మార్గమధ్యలో కడప దర్గా సందర్శించినట్లు సమాచారం. డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 


 


టెంపో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తున్నదని జిల్లా ఎస్పీ అన్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. ప్రమాదానికి కారణమైన టెంపో మదనపల్లెలోని ఎంబీఎస్‌ ట్రావెల్స్‌కు చెందిందని వెల్లడించారు.  


 


సీఎం జగన్‌ దిగ్భ్రాంతి


కర్నూలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa