కడుపు నింపుతున్న వారికి, వారి కుటుంబానికి కాళీ పళ్లెం కనబడుతుంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆ కార్మికులకు జీతాలు చెల్లించలేదు. దీంతో తమ బాధ తీర్చేవారు ఎవరు, తమ ఆకలి చూసేవారు ఎవరూ.. అంటూ ఆ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కడుపు నింపుతున్న ఆయాల కుటుంబాలకు మాత్రం ఖాళీ పళ్లెం దర్శనమిస్తుంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోయే సరికి వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
వాస్తవంగా మధ్యాహ్నం భోజన పథకానికి ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు, చిక్కి వరకు మాత్రమే సరఫరా చేస్తుంది. మిగతా వంటకు కావలసిన నిత్యావసర సరుకులను ఆయాలు పెట్టుబడి పెట్టి మధ్యాహ్నం భోజనం పథకాన్ని నడపవలసి ఉంది. ప్రతి నెల నిత్యావసర సరుకుల బిల్లులను స్థానిక విద్యాశాఖ అధికారికి పంపడంతో వారికి బిల్లు మంజూరవుతాయి.
కానీ ప్రభుత్వం గత ఐదు నెలలుగా మధ్యాహ్నం భోజన పథకం నడుపుతున్న కార్మికులకు జీతాలు ఇచ్చే సంగతి దేవుడెరుగు, కనీసం నిత్యవసర బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి తలెత్తింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థుల భోజనం తెచ్చుకోవాలని బోర్డు పెట్టిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. మరి ప్రభుత్వం నాడు నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేసింది కానీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించే కార్మికులను మాత్రం మరిచింది. గత కొద్ది నెలలుగా వారికి జీతాలు చెల్లించలేదు దీంతో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహిస్తున్న ఆయాల కుటుంబ పాలన భారంగా మారింది.
తమకు జీతాలు చెల్లించాలి అంటూ నిరసనకు దిగి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. ఒకపక్క నిత్యావసర సరుకుల బిల్లులు మంజూరు కాకపోవడం, మరోపక్క జీతాలు రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్న ఆయాలు తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొన్ని నెలలు ఇదే తంతు కొనసాగితే మధ్యాహ్నం భోజన పథకం అటకెక్కే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa