కరోనా వల్ల తలెత్తే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.
బాధితులకు తక్షణమే వైద్యం అందించే విధంగా వైద్య సదుపాయాలను రెడీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కీలక సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రాల్లో తాత్కాలిక ఆస్పత్రులను ప్రారంభించాలని, హోం ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ బాధితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకలు బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు డీఆర్డీవో, సీఎస్ఐఆర్లతో పాటు ప్రైవేట్ రంగాలు, ఎన్జీవోల సహకారం తీసుకోవచ్చునని లెటర్లో తెలిపారు. రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి, వారిని ట్రీట్ చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి తక్షణమే వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని, హాస్పటల్ బెడ్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ఆస్పత్రిల్లో ఆక్సిజన్, మందులు , అవసరమైన సామాగ్రిలపై రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దాంతో పాటు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే దేశంలో 24 గంటల్లో 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి. 406 మరణాలు సంభవించాయి. ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1431 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా ముంబైలో 6,347 కేసులు, ఢిల్లీలో 2,716 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్లో 4 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో 351, కేరళలో 118 మరియు గుజరాత్లో 115 కేసులు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa