దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్న తరుణంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పలు సూచనలు చేసింది. హై రిస్క్ కాకపోతే కరోనా రోగులు కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవవసరం లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. కరోనా పరీక్షలు, రోగుల కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాల సేకరణకు సంబంధించి ఐసీఎంఆర్ సోమవారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకరికి కరోనా పాజిటివ్గా తేలి.. ఆయన లేదా ఆమె కాంటాక్ట్ అయిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే, వయసు పైబడి ఇతర అనారోగ్య సమస్యలున్న హై రిస్క్ వ్యక్తులు కాకపోతే వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. హైరిస్క్ వ్యక్తులను కూడా ఐసీఎంఆర్ నిర్వచించింది. 60 సంవత్సరాలు పైబడిన వారు, షుగర్, బీపీ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండ వ్యాధి, ఇతర ప్రాణాంతకత వ్యాధులు, ఊబకాయం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల కాంటాక్ట్లను మాత్రమే హై రిస్క్ వ్యక్తులుగా ఐసీఎంఆర్ పేర్కొంది. ఇలాంటి వారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలని సూచించింది. ఇక, ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణీలతో సహా శస్త్రచికిత్స లేదా నాన్ సర్జికల్ రోగులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే కరోనా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనా టెస్ట్ కారణంతో అత్యవసర సర్జరీలను వాయిదా వేయవద్దని సూచించింది. అయితే కొన్ని అంశాల పరిగణనతో చికిత్స చేస్తున్న వైద్యుడి అభీష్టం ప్రకారం కరోనా పరీక్షలు చేయవచ్చని వివరించింది. అలాగే, అంతరాష్ట్ర ప్రయాణికులకు కూడా ఇకపై కరోనా టెస్ట్ అవసరం లేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ మేరకు కోవిడ్-19 పర్పసివ్ టెస్టింగ్ స్ట్రాటజీ అడ్వైజరీని ఐసీఎంఆర్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa