చిత్తూరు జిల్లా: కోవిడ్ – 19 ధర్డ్ వేవ్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫీవర్ సర్వే పక్కాగా క్వాలిటీతో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధర్డ్ వేవ్ కోవిడ్ నియంత్రణ అమలు పై జెసి (డెవలప్మెంట్, హెల్త్) శ్రీధర్ తో కలిసి వైధ్య అధికారులతో జిల్లా కలెక్టర్ సుధీర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ – 19 ధర్డ్ వేవ్ లో అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం కోవిడ్ నియంత్రణకు అందుబాటులో ఉన్న 1500 బెడ్లతో పాటు ఈ నెల 20 నాటికి మొత్తం 3 వేల బెడ్ లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
నోడల్ అధికారులకు కేటాయించిన విధుల్లో అలసత్వం లేకుండా స్పందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన కోవిడ్ గైడ్ లైన్స్ మేరకు వ్యవహరించాలని, ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరమైన వైధ్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 35 వ ఫీవర్ సర్వే పూర్తయి, 36 వ ఫీవర్ సర్వే ప్రారంభమైందని, ఫీవర్ సర్వేలో కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఫోన్ ద్వారా ఫీవర్ సర్వే జరిగిందా? లేదా? అన్నది కనీసం రోజుకు వెయ్యి కాల్స్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుందని, అప్పుడే ఆశాలు, ఎ. ఎన్. ఎం లు పక్కాగా సర్వే జరిపే అవకాశం ఉంటుందన్నారు.
మదనపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్. టి. పి. సి ఆర్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంబించాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న టిటిడికి సంబందించి కోవిడ్ కేర్ సెంటర్లు తిరుపతిలో విష్ణు నివాసం, తిరుచానూరులో శ్రీపద్మావతి నిలయంతో పాటు ఈ నెల 20 నాటికి శ్రీనివాసం వసతి సముదాయం కూడా కోవిడ్ కేర్ సెంటర్ కు అందుబాటులోకి రావాలని సూచించారు. ఆసుపత్రులకు సంబందించి ప్రస్తుతం ఉన్న రుయా, స్విమ్స్, స్టేట్ కోవిడ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిత్తూరు, మదనపల్లి లతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 50 శాతం బెడ్లు కోవిడ్ కొరకు కేటాయింపు జరగాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉన్న 104 కాల్ సెంటర్ తో పాటు మండల స్థాయిలో కూడా కాల్ సెంటర్లు వెంటనే అందుబాటులోకి రావాలని సూచించారు.
ఆక్సిజన్ కు సంబందించి జిల్లాలో ఉన్న 23 ట్యాoకులు, డి సిలిండర్స్, కాన్స్oట్రేటర్స్ పూర్తి స్థాయిలో టెక్నికల్ చెకింగ్ చేసి వినియోగంలోకి తేవాలన్నారు. ఆక్సిజన్ ట్యాంకుల పిల్లింగ్ కు సంబందించి తిరుపతిలో 2, చిత్తూరులో ఒక ఏజెన్సీలు ఉన్నాయని, వారిని అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ అయ్యేలా చూడాలని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన మెడిసిన్స్, కంజ్యూమబుల్స్ అవసరాలు గుర్తించి స్టాక్ అందుబాటులో ఉంచాలని ఎపిఎంఐడిసి అధికారులకు సూచించారు.
ఈ సమీక్షలో డి. ఎంఅండ్. హెచ్ఓ డా. శ్రీహరి, డి. సి. హెచ్. ఎస్ డా. సరళమ్మ, డి. హెచ్ చిత్తూరు సూపరింటెండెంట్ అరుణ కుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి, ఇఇ ధనంజయరెడ్డి, డా. శరవణ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa