ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్య రాజ్యసమితి లో ఆసక్తికర పరిణామం నెలకొంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా దూకుడును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. 193 మంది సభ్యులు అసాధారణమైన చర్చను నిర్వహించాయి. అంతర్జాతీయంగా మద్దతు కోల్పోయి ఒంటరైన రష్యా సోమవారం కీలక పరీక్షను ఎదుర్కొంది. అరుదుగా అత్యవసర సమయంలోనే ఐరాస సాధారణ సభ సమావేశం జరుగుతుంది. ఐరాస 77 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకూ సాధారణ సభ 10సార్లు మాత్రమే సమావేశం కాగా.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో సోమవారం 11వ సారి సమావేశమయ్యింది. ఐరాస సభ్య దేశం ఉక్రెయిన్ శాంతి కోసం అభ్యర్ధన చేయగా.. పొరుగుదేశాన్ని సభ్య దేశంగా ఆక్రమించాలనే తన నిర్ణయాన్ని రష్యా సమర్థించింది. సమావేశం ప్రారంభమైన తర్వాత యుద్ధ బాధితుల కోసం ఒక్క నిమిషం పాటించారు. అనంతరం ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో యుద్ధాన్ని తప్పనిసరిగా ఆపేయాలని హెచ్చరించారు. ‘‘అయ్యిందేదో అయ్యింది.. సైనికులు తిరిగి తమ బ్యారక్లు వెళ్లిపోవాలి.. నేతలు శాంతి దిశగా అడుగులు వేయాలి.. పౌరులకు తప్పనిసరిగా భద్రత కల్పించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను తక్షణమే ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో చేసిన తీర్మానానికి మద్దతుగా 100 కంటే ఎక్కువ సభ్య దేశాల ప్రతినిధులు మాట్లాడతారని భావిస్తున్నారు. ఈ తీర్మానం చెల్లుబాటు కాదు. కానీ రష్యా ఎంత ఒంటరిగా ఉందో తెలియజేస్తుంది. ఈ తీర్మానానికి గరిష్ట మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి మద్దతుగా 100కిపై దేశాలు ఓటేస్తాయని భావిస్తున్నారు. భారత్, చైనా, సిరియా, క్యూబా వంటి దేశాలు రష్యాకు అనుకూలంగా ఓటేయడం లేదా గైర్హాజరయ్యే అవకాశం ఉంది. నిరంకుశ తత్వం పెరుగుతున్న ప్రపంచంలో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని, మయన్మార్, సూడాన్, మాలి, బుర్కినా ఫెసో, వెనిజులా, నికరాగ్వా ఇటువంటి పరిస్థితులు నెలకున్నాయని దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ మనుగడ సాగించకపోతే, ఐక్యరాజ్యసమితి మనుగడ సాగించదు. భ్రమలు వద్దు’’ అని తీర్మానానికి మద్దతు ఇవ్వాలని సభ్య దేశాలను అభ్యర్థించారు. అయితే, ఈ ఆరోపణలను రష్యా రాయబారి వాస్సిలే నెబెంజియా ఖండించారు. తూర్పు ఉక్రెయిన్లోని ప్రజలను రక్షించడానికే తాము సైనిక చర్యను చేపట్టామని దాడిని సమర్ధించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa