భార్యే భర్తకు భరణం చెల్లించాలని ఓ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, గొడవలు సర్వసాధారణమే. కలహాలు లేని కాపురం ఉండదని పెద్దలు అంటారు. అయితే, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే ఏ సమస్యా ఉండదు. అయితే కొన్నిసార్లు చిన్న కారణాలతో సంసారంలో చిచ్చు రేగి వారి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడుతుంది. ఇది చివరకు విడాకులు దారితీస్తుంటాయి. వైవాహిక బంధం విచ్ఛినమైనప్పుడు సాధారణంగా భార్య పోషణ ఖర్చుల కింద భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ, భార్య విడాకులు తీసుకున్న సందర్భాల్లో మాత్రం భర్తకు భరణం ఇవ్వాల్సిందే బాంబే హైకోర్టు సంచలన తీర్చు వెలువరించింది. ఈ సందర్భంగా కింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. కేసు వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ జంటకు 1992 ఏప్రిల్ 17న వివాహం జరిగింది. కొన్నాళ్లు సంతోషంగా సాగిపోయిన వీరి కాపురంలో అనుకోని సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న భార్య.. 2105లో నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా తాను విడాకులు కోరలేదని భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందున వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24, 25 ప్రకారం ఆమె నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మంచి వేతనం పొందుతోందని, ఆమెకు ఆ ఉద్యోగం రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని సదరు భర్త న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. వివాహం తర్వాతే ఆమె డిగ్రీ, పీజీ, బీఎడ్ పూర్తి చేయించానని తెలిపాడు. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్నా ఆమె లక్ష్యం నెరవేర్చడానికి త్యాగం చేశానని వివరించాడు. అంతేకాదు, ఆమె వల్ల తాను వేధింపులకు గురయ్యాయని వాపోయాడు. విడాకులు తీసుకోవడం వల్ల తన జీవితం అస్తవ్యస్తమవుతుందని వాదించాడు. నెలకు రూ.30 వేలు వేతనం వస్తోందని, అందులో తనకు సగం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఈ వాదనలతో ఏకీభవించిన నాందేడ్ సివిల్ కోర్టు.. భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి వివాదం పరిష్కరించే వరకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 3,000 భర్తకు చెల్లించాలని 2017లో ఆదేశించింది. 2019లో మరోసారి ఇటువంటి ఆదేశాలే జారీచేసింది. నెలకు రూ.5,000 చొప్పున భార్య వేతనం నుంచి కట్ చేసి కోర్టుకు అందజేయాలని ఆమె పనిచేసే స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి సూచించింది. దీంతో రెండు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది.. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్లో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ భారతి దాంగ్రే ధర్మాసనం విచారణ చేపట్టింది. తన భర్తకు ఓ దుకాణం ఉందని, ఆటో రిక్షాను కూడా అద్దెకు ఇస్తున్నాడని భార్య వాదించారు. తమకు ఓ కుమార్తె ఉందని అతడి ఆదాయంలో నుంచి నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa