ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి సహకారం...మీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: భారత్ కు అమెరికా హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 03:33 PM

చైనా, రష్యా దేశాల  పరస్పర సహకారం భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని భారత్ కు అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విషయంలో భారత్ వైఖరి పట్ల అగ్రరాజ్యం అమెరికా అసంతృప్తిని వెళ్లగక్కుతోంది. ఉక్రెయిన్‌పై దాడిని భారత్‌ ఖండించకపోవడం, వ్లాదిమిర్ చర్యలను వ్యతిరేకించకపోవడాన్ని బైడెన్ యంత్రాంగం తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ పర్యటనకు రావడంతో అమెరికా మరింత రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ను హెచ్చరించింది. భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధ, గురువారాల్లో భారత అధికారులతో విస్త్రృతంగా చర్చలు జరిపిన ఆయన.. ఈ సమయంలో మోదీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, దలీప్‌ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ విధానాన్ని తప్పుపట్టారు. యుద్ధాన్ని కొనసాగుతుంటే.. రష్యా నుంచి భారత్‌ రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపైనా అభ్యంతరాలు తెలిపారు. ఈ లావాదేవీలు రష్యాపై తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. క్రెమ్లిన్ నుంచి ఇంధనం కొనుగోలుకు భారత్‌ చూపిస్తున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలని దలీప్ సంకేతాలు వెలువరించారు. లవ్రోవ్‌ పర్యటనలో ప్రధానంగా చమురు దిగుమతులు, రూపాయి-రూబెల్ చెల్లింపుల విధానంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌ లావాదేవీల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్‌ బలపడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము సహించబోమని దలీప్ స్పష్టం చేశారు. తమ ఆంక్షలను నిర్వీర్యం చేసేలా ఏ దేశం వ్యవహరించినా, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తమ దేశాల మధ్య హద్దుల్లేని సహకారం ఉందంటూ ఇటీవల రష్యా-చైనా పదేపదే చెబుతున్న అంశాన్నీ దలీప్‌ సింగ్‌ ప్రస్తావించారు. ఈ సహకారం భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, భవిష్యత్తులో చైనాకు జూనియర్‌ భాగస్వామిగా రష్యా తయారవుతుందని పేర్కొన్నారు. అప్పుడు వాస్తవాధీన రేఖను డ్రాగన్‌ ఉల్లంఘించి దాడికి పాల్పడితే భారత్‌ను ఆదుకోడానికి రష్యా ముందుకొస్తుందా? అని ప్రశ్నించారు. రష్యాపై చైనా పట్టు సాధిస్తే అది భారత్‌కు మరింత నష్టమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా అనవసరమైన యుద్ధం చేస్తున్న రష్యాపై విధించిన ఆంక్షలను ఏ దేశామైనా ఉల్లంఘిచే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అయితే, అమెరికా, భారత్‌ వంటి స్నేహితులు ఈ విషయంలో కలిసి ముందుకెళ్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగిన చర్చలలో ప్రపంచ శాంతి, భద్రతకు ఆధారమైన ప్రధాన సూత్రాలను రక్షించడం గురించే ప్రస్తావనకు వచ్చాయన్నారు. ‘‘మా ఆంక్షల విధానాలు, భాగస్వామ్య సంకల్పాన్ని తెలియజెప్పడానికి, మాతో చేతులు కలపడం వల్ల కలిగిే ప్రయోజనాలను వివరించడానికి నేను స్నేహ స్ఫూర్తితో ఇక్కడకు వచ్చాను.. మేము విధించి ఆంక్షలను ఉల్లంఘించడానికి చురుకుగా ప్రయత్నించే దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయి.. రూబుల్‌ను ఆసరాగా చేసుకుని డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అణగదొక్కే ప్రయత్నం చేసే యంత్రాంగాలను రూపొందించకూడదని మేము అన్ని దేశాలకు ముఖ్యంగా మా మిత్రదేశాలు, భాగస్వాములకు సూచించాం’’ అని దలీప్ సింగ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో భారత వైఖరి ప్రభావం క్వాడ్‌పై ఉంటుందా? అన్న ప్రశ్నకు దిలీప్ బదులిస్తూ.. ఆసియా-పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ముప్పును ఎదుర్కొడానికి ఈ కూటమి ఏర్పడిందని చెప్పారు. భారత్‌పై అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే భారతీయ అధికారులు స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa