ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ అగ్నిప్రమాదం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 10:20 AM

నూజివీడు పరిధిలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోరస్‌ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్​ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం.


విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ,నూజివీడు డీఎస్పీ.. ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను.. పరిశ్రమ ప్రతినిధులు పరామర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్లు సమాచారం.


 


అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa