మనదేశంలో పలు రాష్ట్రాలు పోటీపడి అప్పులు తీసుకొస్త ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తున్నారు. ఈ తీరు ఆయా రాష్ట్రాలకు ఏ మాత్రం సరికాదని ఇటీవల ప్రచురితమైన ఓ కథనం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో అప్పుల కుప్పలు పెరిగిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికైనా మేలుకోవాలని, లేదంటే పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాసుకొచ్చింది. నిజానికి కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే.. అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారడం మొదలైందని పేర్కొంది.
తమ సొంత ఆదాయం తగ్గిపోవడంతో రాష్ట్రాలు అప్పులపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ సెంటర్ డిస్కం ఎస్యూరెన్స్ యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణమని వివరించింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని ఇతర అంశాలు కూడా వాటి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయని తెలిపింది. నిజానికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదలే ఎక్కువగా ఉందని ‘కాగ్’ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చలేకపోతున్నాయని తెలిపింది.
ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రకటించారని, ప్రస్తుత అప్పులకు అవి కూడా తోడైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని పేర్కొంది. పంజాబ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని, గత నాలుగేళ్లలో పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు 9 శాతంగా ఉంటే వడ్డీ చెల్లింపు రేటు 3 శాతం పెరిగిందని, జీఎస్డీపీలో 53 శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే దారుణంగా ఉందని రాసుకొచ్చింది.
యూపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంటే, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అప్పులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు రూ. 3.89 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ. 40 వేల కోట్లు ఎక్కువ. ఏపీ జీఎస్డీపీలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది. ఏపీకి ఉన్న మొత్తం చెల్లింపుల భారం కూడా లెక్కల్లోకి తీసుకుంటే జీఎస్డీపీలో మన భారాల వాటా శాతం ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa