‘పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే చెప్పా. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించామని, జిల్లాల ఇన్చార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశామని.. వీరందరినీ మంత్రులు గౌరవించాలని చెప్పారు. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం అని.. అందరూ కలసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి కేబినెట్ హోదా కల్పిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వచ్చే రెండేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి మార్గ నిర్దేశం చేస్తూ మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తమ కన్నా ఎక్కువ అనే భావనతో మంత్రులు ఉండాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధం కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa