భారీ వర్షాలు అసోంలోని ఆ గ్రామాల ప్రజలను నిరాశ్రయులను చేసింది. రైల్వే ట్రాక్ లే వారికి నివాసాలుగా మారాయి. అసోంలోని జమునాముఖ్ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు చెందిన 500లకు పైగా కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రైల్వే ట్రాక్ లపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఏకమై లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 2,585 గ్రామాలకు చెందిన 8 లక్షల మందికి పైగా వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జమునాముఖ్ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు చెందిన 500లకు పైగా కుటుంబాలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని రైల్వే ట్రాక్లపై రోజులు గడుపుతున్నాయి.
‘‘మొదటి మూడు రోజులు గుడారాలు కూడా లేవు.. ఆ తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులతో టార్పాలిన్ షీట్లు కొనుక్కొచ్చాం.. ప్రభుత్వం, అధికారుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.. తాగడానికి మంచి నీళ్లు లేవు. రోజుకు ఒక పూటే తింటున్నాం’’ అని మోన్వారా బేగమ్ అనే బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. పటియా పాథర్కు చెందిన మోన్వారా బేగమ్ (43) మరో నలుగురు కుటుంబసభ్యులతో కలిసి తాత్కాలికంగా వేసుకున్న గుడారంలో ఉంటున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కారణంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు.
ఇదిలావుంటే గ్రామాలను వరద నీరు చుట్టుముట్టి మునిగిపోయాయి. రైల్వే ట్రాక్ కాస్త ఎత్తులో ఉండటం వల్ల ముంపునకు గురికాలేదు. వరదలకుసర్వం కోల్పోయిన చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలకు చెందిన కుటుంబాలు ట్రాక్పై టార్పాలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. గత ఐదు రోజులుగా తమ పరిస్థితి ఇలాగే ఉందని, తినడానికి తిండి కూడా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే మొత్తం 342 సహాయక శిబిరాల్ల 86,772 మంది ఆశ్రయం పొందుతున్నారు. మరో 411 రిలీఫ్ కేంద్రాల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, పారామిలటరీ దళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గల్లంతయ్యారు.
మరోవైపు అసోం ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు నాలుగు రోజుల తర్వాత కొంత మందికి కొద్దిగా బియ్యం, పప్పు, వంట నూనె అందించి చేతులు దులుపుకోవడం గమనార్హం. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించడంతో కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ ఎఫ్), స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa