ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పీసీసీ చీఫ్ పదవి పట్ల నల్లారి అనాసక్తి...ఎందుకంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:14 PM

రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకొనేందుకు ఎంతగా ప్రయత్నించినా సఫలం కావడంలేదు. తాజాగా ఏపీ పీసీసీ సీటులో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి బలపడాలని యోచించిన హస్తం పార్టీ అధినాయకత్వం ఆశలు ఏ మాత్రం ఫలించేలా లేవు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి నియ‌మించి రాష్ట్రంలో పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్వాలు తీసుకురావాల‌ని ఆశ‌ప‌డ్డ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి కిర‌ణ్‌కుమార్ రెడ్డి నిరాకరించిన‌ట్లు తెలుస్తోంది. సోనియాతో 45 నిముషాల‌పాటు స‌మావేశ‌మైన కిర‌ణ్‌కుమార్ ప‌ద‌వి తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేద‌ని స‌మాచారం. దీంతో భేటీ ముగిసిన త‌ర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.


త‌న సోద‌రుడు ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నార‌ని, చిత్తూరు జిల్లాలో కీల‌క‌మైన నేత‌గా ఉన్నార‌ని, ఒక‌వేళ తాను పీసీసీ ప‌ద‌వి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సిఫార్సుతో ప‌ద‌వి తీసుకున్న‌ట్లుగా ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తార‌ని, దీనివ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సోనియాకు న‌చ్చ‌చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్యా త‌న సోద‌రుడు కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చే అవ‌కాశం కూడా లేద‌ని చెప్పారు. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అయితేనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊపు వ‌స్తుంద‌ని, శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెల‌కొంటుంద‌ని అధిష్టానం భావిస్తోంది. ఏపీకి ఇన్ చార్జిగా ఉన్న ఉమెన్‌చాందీతోపాటు ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు కిర‌ణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.


ఇదిలావుంటే కిర‌ణ్ సోద‌రుడు కిషోర్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. పార్టీ ఇన్‌ఛార్జిగా కొన‌సాగుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీప‌డ‌నున్నారు.


ఇటువంటి ప‌రిస్థితుల్లో తాను పీసీసీ ప‌ద‌వి చేప‌ట్టినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉండ‌టం, చంద్ర‌బాబునాయుడు, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కుమ్మ‌క్క‌య్యారంటూ వైసీపీ ప్ర‌చారం చేసే అవ‌కాశాలుండ‌టం లాంటివ‌న్నీ దృష్టిలో ఉంచుకొని ప్ర‌స్తుతానికి కిర‌ణ్ నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే సీనియ‌ర్ నేత‌లు ఒత్తిడి చేస్తుండ‌టంతో వారి ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో వేచిచూడాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa