ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ విన్నపానికి...ఒకే చెప్పిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 10:41 PM

బీజేపీ, వైసీపీ మధ్య  విమర్శల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. జగన్ సర్కార్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ కాలాన్ని కేంద్రం మరో రెండేళ్లు పొడిగించింది.. ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ (ఐడీఈఎస్‌)కు చెందిన ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ గత నెల 14 ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని ఇక్కడే కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం సానుకూలంగా స్పందించింది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ను పొడిగిస్తూ డీవోపీటీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన మరో రెండేళ్లు టీటీడీ అదనపు ఈవో పోస్టులోనే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.


మరోవైపు ధర్మారెడ్డిని టీటీడీ అదనపు ఈవోగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి పిటిషన్ వేశారు. దేవదాయ చట్టంలోని 107వ సెక్షన్‌ ప్రకారం.. జిల్లా కలెక్టర్‌, లేని పక్షంలో ఆ ర్యాంకుకు తగ్గని అధికారికి మాత్రమే ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత ఉందని ప్రస్తావించారు. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరి.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, సాధారణ పరిపాలన,.. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, టీటీడీ మేనేజ్‌మెంట్‌ కమిటీ, టీటీడీ ఇంఛార్జ్ ఈవో ధర్మారెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.


ఏపీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌రెడ్డి బదిలీ కావడంతో.. టీటీడీ ఈవో పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వం మే 8న జీవో 813 జారీ చేసింది. ఐడీఈఎస్‌ అధికారి ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్‌ స్థాయి అర్హత లేదని.. అందుకే ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టరు, ఆ హోదాకు సమాన అర్హతలున్న వ్యక్తిని ఈవోగా నియమించేలా చూడాలని కోరారు. దీనిపై విచారణ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa