ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీని విసిరి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు: అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 10:02 PM

జగన్ అసమర్ధ, అవినీతి పాలనపై ప్రజలు చిర్రెత్తిపోయి ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైసీపీని విసిరి బంగాళాఖాతంలో పారేద్దామా అన్నట్లు ఎదురు చూస్తున్నారన్నారని టీడీపీ  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. . జగన్ రెడ్డి అండ్ బ్లూ బ్యాచ్ దిక్కుమాలిన సవాళ్లు చేయడం మాని.. ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.  శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తోందన్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని గుర్తు చేశారు. మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉపఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. 1999లో నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చనిపోతే.. 2002లో ఉప ఎన్నికలు జరిగాయని.. ఆ ఎన్నికల్లో ఆయన భార్య ధీరావత్ భారతి నాయక్ అభ్యర్ధిగా నిలబడినప్పుడు టీడీపీ అధికారంలో ఉండి కూడా పోటీ చేయలేదని గుర్తు చేశారు.


నంద్యాల లోక్ సభ ఉపఎన్నికల్లోనూ పోటీ చేయకుండా.. తెలుగు వ్యక్తి పీవీ నరసింహరావు ప్రధానిగా ఎన్నికయ్యేలా చేశామన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వై.ఎస్.విజయ పోటీ చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్ధిని నిలబెట్టలేదన్నారు. 2021 తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే.. జగన్ ఆ కుటుంబంలోని వ్యక్తికి కాకుండా ఇతరులకు సీటు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశామన్నారు.


ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికల అభ్యర్ధిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులే ఉన్నారని గుర్తు చేశారు. అందుకే తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ.. పోటీకి దూరంగా ఉన్నామన్నారు. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు కేటాయిస్తే.. తెలుగుదేశం పార్టీ తప్పక పోటీలో నిలబడుతుందని.. సత్తా చాటుతుందని తేల్చి చెప్పారు. మరణించిన శాసనసభ్యుల స్థానాల్లో పోటీపై టీడీపీ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పామన్నారు. పోటీపై సవాళ్లు చేస్తున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చిత్తశుద్ధి ఉంటే తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa