ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై పిటిషన్ వేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను కోర్టులు నడిపించలేవని పేర్కొంది. మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని చూపించి.. ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ చట్టం(1993)కి సవరణ చేసింది. ఈ సవరణ చట్టాల(యాక్ట్ 31/2021, యాక్ట్ 9/2022)ను సవాల్ చేస్తూ రఘురామ కోర్టులో పిల్ దాఖలు చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని.. ఈ తరహా పిల్స్ ప్రోత్సహిస్తే రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లను కూడా కోర్టుల్లో సవాల్ చేస్తారని వ్యాఖ్యానించింది. ఈ పిల్ను విచారణకు స్వీకరించలేమని.. ఇందులో తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని.. ఒకవేళ వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్లో జమయ్యే మొత్తం సొమ్ములో 25శాతానికి మించి ప్రభుత్వం అప్పు చేయడానికి వీల్లేదని పిటిషనర్ తరఫున కోర్టులో లాయర్ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రుణపరిమితికి మించి అప్పులు చేసిందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించి.. ఆ ఆదాయాన్ని తనఖా పెట్టి రుణం పొందుతోందని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి చేసిన అప్పులపై కేంద్రం ఇప్పటికే వివరణ కోరిందని కోర్టుకు చెప్పారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని.. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని గుర్తు చేశారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందించింది. ఫలానా విధానంలోనే రుణం పొందాలని ఎలా చెబుతారని పిటిషనర్ను ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని శాసించడానికి 'మీరెవరని' ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని వ్యాఖ్యానించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా ఉందో లేదో ఆర్బీఐ, కాగ్ చూసుకుంటాయని వ్యాఖ్యానించింది కోర్టు. ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ తనకు వచ్చే ఆదాయాన్ని చూపి రుణం పొందితే.. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం కలుగుతుందని ప్రశ్నించింది. ఈ పిల్ను పరిశీలిస్తే.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకూడదని పిటిషనర్ కోరుకుంటున్నట్లు ఉందని అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలు నిలువరించడం కోసం వేసిన ఈ పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం నిర్వచనంలోకి ఎలా వస్తుందని నిలదీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa