కాలం మారుతున్న కులం వాసనలను మనిషులుు వీడటం లేదు. ఒకే మతానికి చెందిన వారైనా కులం పేరుతో హత్యలు చేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలావుంటే అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. గతేడాది పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న జంట... వారికి దూరంగా వేరే ప్రాంతంలో కాపురం పెట్టింది. అయినా వారిని వదిలిపెట్టలేదు. యువకుడ్ని అపహరించి గొంతుకోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి, వీణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాలమ్మ, నాగన్న దంపతుల కుమారుడు మురళి (27) పీజీ తర్వాత పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. డిగ్రీ పూర్తిచేసిన వీణ గ్రామ మహిళా పోలీసుగా ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మురళి, వీణలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసి అభ్యంతరం చెప్పారు. దీంతో గత ఏడాది జూన్లో ఇంటిలో నుంచి వెళ్లిపోయిన వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దంపతులిద్దరూ అనంతపురం జిల్లా రాప్తాడులో నివాసం ఉంటున్నారు.
పరిశ్రమకు వెళ్లడానికి గురువారం సాయంత్రం రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం మురళి వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని బలవంతంగా లాక్కెళ్లారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వీణ తన భర్తకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో స్నేహితులు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి భర్త గురించి ఆరా తీసింది. అయినా సరే ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్యలో ఓ యువకుడు శవం ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి చూడగా గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. అతడ్ని కిడ్నాప్కు గురైన మురళిగా గుర్తించి, హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తమ పెళ్లి ఇష్టం లేకనే తన తల్లి భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆదారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa