అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ను ఏకంగా 12 గంటల పాటు మూసివేశారు. ‘అగ్నిపథ్ ’ పథకానికి నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన ద్వారాల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా తిరిగే వారిని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఆవరణలో ఎక్కువమంది గుమికూడకుండా హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ప్రయాణ టికెట్లు ఉంటేనే లోపలికి అనుమతించారు. విధ్వంసానికి పాల్పడవద్దంటూ యువతకు ప్రత్యేక సిబ్బందితో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దువ్వాడ, గోపాలపట్నం, సింహాచలం, మర్రిపాలెం, పెందుర్తి స్టేషన్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. డీఆర్ఎం అనూప్ సతపతి అన్ని రైల్వేస్టేషన్ల అధికారులతో సమీక్షించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ అధికారులతోనూ భద్రతాపరమైన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ‘రైల్వే ఆస్తులు దేశ సంపద.. అవి ప్రజలందరివీ.. వాటికి ఎవరూ ఏవిధమైన నష్టం కలిగించొద్దు.. నష్టం కలిగించేలా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి’ అని ఆయన కోరారు. విశాఖ రైల్వే స్టేషన్తో పాటు రైల్వే కాలనీలు, లోకో షెడ్డుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులు దాడులు చేస్తారనే సమాచారం రావడంతో విశాఖ రైల్వే స్టేషన్ను మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేస్తున్నట్టు తెలిపిన అధికారులు.. ఎవ్వరికీ అనుమతిలేదని స్పష్టం చేశారు. హౌరా నుంచి వచ్చే అన్ని రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి, దారి మళ్లిస్తున్నారు. అలాగే, విజయవాడ మీదుగా విశాఖకు వచ్చే రైళ్లను దువ్వాడ స్టేషన్లో నిలిపివేసి దారి మళ్లిస్తున్నారు.
గరీబ్రథ్, ఎల్టీటీ, తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లను దువ్వాడ వద్ద నిలిపివేయనున్నారు. తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలును అనకాపల్లి వద్దే నిలిపివేస్తారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను శనివారం కూడా రద్దు చేశారు. గుణుపూరు-విశాఖ, విశాఖ-భువనేశ్వర్ ఇంటర్సిటీ, విశాఖ-కిరండూల్, భువనేశ్వర్-సికింద్రాబాద్, విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ-నిజాముద్దీన్ రద్దు చేశారు. ఆదివారం కిరండూల్-విశాఖ, సింహాద్రి, సోమవారం నిజాముద్దీన్-విశాఖ (సమతా) రైళ్లు రద్దయ్యాయి.
విశాఖ స్టేషన్కు రైళ్లు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటల వరకే ఉన్న ప్రయాణికులను తనిఖీలు చేసి అనుమతిస్తున్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల వద్ద పోలీసులను మోహరించారు. స్టేషన్ రోడ్డులోని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద పటిష్ట భద్రతను కల్పించారు.
మరోవైపు, విశాఖ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ శుక్రవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. స్టేషన్లోకి ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతాలు, టికెట్ కౌంటర్లు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లో చేపట్టిన భద్రతా చర్యలపై ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa