ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీలుగా పుట్టడమే నేరమా: అయ్యన్న సతీమణి పద్మావతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 04:29 PM

జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా బీసీలుగా పుట్టడమే నేరమా అంటూ ఆయన సతీమణి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి కరెంట్ నిలిపివేసి తెల్లవారు జామున కూల్చివేతకు దిగారని ఆరోపించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ ఉండాలని.. రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటని ప్రశ్నించారు.  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె పేర్కొన్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం వేధింపులుకు గురిచేస్తోందని.. రాష్ట్రంలో కక్షతో టార్గెట్ చేసి రాజకీయాలతో చంపుతున్నారు, తమని చంపండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు.


నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్‌ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ సిబ్బంది తీరును అయ్యన్న రెండో కుమారుడు చింతకాయల రాజేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని.. ల్యాండ్‌ పర్మిషన్‌ ఇచ్చాకే కట్టామని రాజేష్ అన్నారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని..అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారన్నారు.


అయ్యన్నపాత్రుడు పంట కాల్వను ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడను నిర్మించారంటూ మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆయన ఇంటివైపు వెళ్లే దారుల్ని మూసివేశారు. టీడీపీ కార్యకర్తలు, అయ్యన్న అభిమానులు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు మాత్రం నర్సీపట్నంలో లేరు.. హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa