ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ప్రతి చెల్లింపుపై ఐటీ కన్ను..నిశితంగా పరిశీలన

national |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 01:29 AM

పన్ను ఎగవేతదార్ల పనిపడుతున్న ఆదాయపు పన్నుశాఖ తాజాగా వినూత్న నిర్ణయం తీసుకొంది. ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు చెందిన ప్రతి లావాదేవీపై కన్నేసింది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఖర్చులు చేస్తున్నారు..? ఏ రకమైన లావాదేవీలను నిర్వహిస్తున్నారు..? వంటి వాటిని పరిశీలిస్తోంది. ఒకవేళ నిర్దేశిత పరిమితి మంచి ఎవరైనా లావాదేవీలు చేసి.. వాటిని ఐటీఆర్  ఫైలింగ్‌లో పేర్కొనకపోతే.. ఆదాయపు పన్ను విభాగం వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది.


అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో ప్రతి లావాదేవీపై కన్నేస్తోంది. వీటిపై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించేందుకు.. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఏయే లావాదేవీలపై ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ కన్నేసిందో ముందుగానే తెలుసుకుంటే ఆదాయపు పన్ను విభాగానికి చెందిన నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు. ఆరు రకాల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ లావాదేవీలేమిటో ఓసారి చూద్దాం..


నిర్దేశిత పరిమితికి మించి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసిన ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అకౌంట్లో రూ.50 లక్షలకు మించితే వివరణ ఇవ్వాలి.


ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులో రూ.10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను విభాగం నుంచి మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఫామ్ 61ఏ ద్వారా ఈ సమాచారాన్ని బ్యాంకు ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేస్తుంది. సింగిల్ ఎఫ్‌డీ అయినా లేదా మల్టిపుల్ ఎఫ్‌డీలైనా.. ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ఆదాయపు పన్ను విభాగానికి తెలుపాలి.


ఒకవేళ మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.లక్షపైన ఉంటే.. ఆదాయపు పన్ను విభాగానికి ఆ విషయం తెలపాలి. అంతేకాక రూ.10 లక్షలకు మించి క్రెడిట్ కార్డు సెటిల్‌మెంట్ చేస్తే కూడా ఆ సమాచారాన్ని ఐటీ విభాగానికి తెలియజేయాలి. లేదంటే మీకు నోటీసులు వస్తాయి. రూ.30 లక్షలకు మించి స్థిరాస్తులను ఎవరైనా కొన్నా లేదా అమ్మినా ఆ సమాచారాన్ని రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లు ఆదాయపు పన్ను విభాగానికి చెబుతారు. ఒకవేళ మీరు ఐటీఆర్‌లో ఈ లావాదేవీని పేర్కొనకపోతే.. మీకు నోటీసులు వస్తాయి.


ఒక ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్ల పెట్టుబడి పరిమితి రూ.10 లక్షలకు మించితే మీరు తప్పనిసరిగా ఆ సమాచారాన్ని డిస్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ రిటర్ను స్టేట్‌మెంట్‌లో ఆ లావాదేవీల వివరాలు పేర్కొనాలి.


ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి విదేశీ కరెన్సీలను విక్రయిస్తే కూడా మీరు ఆదాయపు పన్ను విభాగం కనుసన్నల్లోకి వచ్చేస్తారు. మీరు తప్పనిసరిగా ఆ లావాదేవీని ఐటీ డిపార్ట్‌మెంట్‌కి తెలుపాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa