మొన్నటి వరకు భారీ వర్షాలు..వరదలతో గజగజ వణికిన ఒడిశా రాష్ట్రం తాజాగా డయారియాతో బెంబేలేత్తుతోంది. ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. డయారియాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 71 మంది ఆస్పత్రిపాలయ్యారు. రాయగడ జిల్లాలోని అనేక గ్రామాల్లో కలుషిత నీటి తాగి అస్వస్థతకు గురైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల్లో కాశీపూర్ బ్లాక్లోని వివిధ గ్రామాల్లో మరణాలు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా 11 మంది డాక్టర్ల బృందం బాధిత గ్రామాలను సందర్శించి నీటితో పాటు బ్లడ్ శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపించారు. మలిగూడ, దుదుకబహల్, టికిరి, గోబ్రిఘాటి, రౌత్ఘటి, జలఖురా గ్రామాల్లో చాలామంది డయారియా బారిన పడినట్టు అధికారులు తెలిపారు. దంగసిల్, రెంగా, హడిగూడ, మైకంచ్, శంకరాడ, కూచిపదార్ గ్రామాల్లోనూ చాలామంది డయేరియా బారిన పడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
కలుషిత నీరు తాగి ఆస్పత్రిలో చేరిన 71 మందిలో.. 46 మంది టికిరి పబ్లిక్ హెల్త్ సెంటర్, 14 మంది కాశీపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, 11 మంది బాలికలు థాటిబార్ పీహెచ్సీలోని ఆశ్రమ పాఠశాలలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒక రోగి పరిస్థితి విషమించడంతో కోరాపుట్లోని ఎస్ఎల్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్, చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లాల్మోహన్ రౌత్రే వైద్య సంస్థలను సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మలిగూడలోని బహిరంగ బావిలో నీరు కలుషితమైందని, గ్రామాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు సీడీఎంఓ తెలిపారు. ఇతర గ్రామాల్లోని నీటి వనరులను కూడా గుర్తించి శుద్ధి చేస్తామని అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటన అసెంబ్లీలో నిరసనలకు దారితీసింది. కాగా కాశీపూర్ బ్లాక్లో కలుషిత నీటి వల్ల చాలాసార్లు వ్యాధులు వ్యాప్తి చెందాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. 2008లో డయేరియా కారణంగా దాదాపు 100 మంది మరణించగా.. 2010లో కలరా వల్ల కూడా వందమందికిపైగా ప్రాణాలను కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa