తన భార్య అక్షత కుటుంబం ఆది నుంచే సంపన్న కటుంబమేమీ కాదని బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ప్రవాస భారతీయుడు, అక్కడి అధికార పార్టీ ఎంపీ రిషి సునాక్ పేర్కొన్నారు. తన అత్తగారు సుధామూర్తి ఇచ్చిన 200 పౌండ్లతో తన మామ నారాయణమూర్తి వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టారని తెలిపారు. ఓ ఆశయంతో కదిలిన తన మామ... ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత విజయవంతమైన కంపెనీల్లో ఒక దానిని నెలకొల్పారని తెలిపారు. తనకు పిల్లనిచ్చిన అత్తామామలను ఆకాశానికెత్తేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె అక్షతను రిషి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రిషి సునాక్... తాజాగా ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా చేయడంతో ఆ పదవి రేసులో అందరి కంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తనపైనా, తన భార్య, అత్తామామల సంపదపైనా వస్తున్న విమర్శలపై స్పందించిన సునాక్... ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మూర్తి దంపతుల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
అంతేకాకుండా తన మామ నెలకొల్పిన సంస్థలో చాలా మంది బ్రిటిషర్లు పని చేస్తున్నారని కూడా చెప్పారు. తన మామ ప్రస్థానం తనకు ఎంతగానో గర్వకారణమని కూడా ఆయన తెలిపారు. తాను ప్రధానిగా పదవి చేపడితే.. తన మామ సాధించిన విజయ గాథలను స్థానికంగానూ ఎన్నింటినో సృష్టించగలననే విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa