అత్యున్నత స్థానానికి ఎవరు ఎదిగినా సరే వారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగానే ఏర్పడుతుంది. వారి కోసం గుగూల్ వంటి వాటిల్లో వెతకడం జరుుతుంది. తాజాగా ఆ జాబితాలో రోష్ని నాడార్ చేరారు. దేశంలో అత్యంత ధనిక మహిళగా హెచ్ సీఎల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ నిలవడం, ఆమె ఆస్తులు ఏకంగా రూ.84,330 కోట్లుగా హరూన్ లిస్టు వెల్లడించడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఆమెకు సంబంధించిన వివరాలపై నెటిజన్లు గాలిస్తున్నారు. హెచ్ సీఎల్ కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తెనే రోష్ని నాడార్. ఆమె వయసు 40 ఏళ్లు. రోష్నికి 2010లో వివాహం జరిగింది. భర్త పేరు శివ్ మల్హోత్రా హెచ్ సిఎల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, హెచ్సీఎల్ హెల్త్ కేర్ వైస్ చైర్మన్ గా, శివ్ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
రోష్ని నాడార్ 2013లో హెచ్ సీఎల్ కంపెనీలోకి అడుగుపెట్టారు. ఒక్కో స్థాయిలో ఎదుగుతూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో స్థాయికి చేరారు.
2020లో శివ నాడార్ తన బాధ్యతల నుంచి తప్పుకొని రోష్నిని హెచ్ సీఎల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమించారు. దీనితో హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, హెచ్ సీఎల్ హెల్త్ కేర్ సంస్థలన్నీ ఆమె పరిధిలోకి వచ్చాయి. ఢిల్లీలో పుట్టి పెరిగిన రోష్ని నాడార్.. వసంత్ వ్యాలీ స్కూల్ లో చదువుకున్నారు. తర్వాత అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఉన్న నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్ స్పెషలైజేషన్ తో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అక్కడే ఎంబీఏ చేశారు. ఈ క్రమంలోనే స్కై న్యూస్, సీఎన్ ఎన్ వంటి చానళ్లలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. పర్యావరణ, జంతు ప్రేమికురాలిగా రోష్నికి పేరుంది. 2018లో ది హ్యాబిటాట్స్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా పర్యావరణ రక్షణ, వన్య ప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. 2017 నుంచి 2019 వరకు ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది పవర్ ఫుల్ మహిళల జాబితాలోనూ రోష్ని స్థానం సంపాదించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa