మొక్కలు నాటకుండా పాఠశాల ప్రధానోపాధ్యయుడు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థినీలు ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన అధికార్లు విచారణ చేపట్టారు. ఒక పక్క సాంకేతికంగా అభివృద్ధి జరుగుతున్నా.. కొందరి మెదళ్లలో మాత్రం అనాగరికమైన ఆలోచనల గూడుకట్టుకుని ఉంటున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మనం నిజంగా అభివృద్ధి చెందుతున్నామా..? లేదా..? అనే అనుమానాలు రాక మానవు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన అచ్చం లాంటిదే. పీరియడ్స్ కారణంగా విద్యార్థినుల పట్ల వివక్ష చూపుతున్న ఉదంతం అక్కడ చోటుచేసుకుంది. అక్కడ ఓ ఉపాధ్యాయుడు పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నాడంట. తనని, పీరియడ్స్లో ఉన్న ఇతర అమ్మాయిలను మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నాడని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక గిరిజన విద్యార్థిని ఆరోపించింది. దీనిపై విచారణకు గిరిజనాభివృద్ధి శాఖ ఆదేశించింది.
పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు మొక్కలు నాటితే అవి పెరగవని, పైగా కాలిపోతాయని ఆ టీచర్ చెప్పారని 12వ తరగతి విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. త్రయంబకేశ్వర్ తాలూకాలోని దేవ్గావ్లోని బాలికల సెకండరీ, హయ్యర్ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో ఆ బాలిక చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు అందినట్టు గిరిజన అభివృద్ధి శాఖ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్తో సహా అందరి స్టేట్మెంట్లను తీసుకుని విచారణ నిర్వహిస్తామని అదనపు కమిషనర్ సందీప్ గోలాయిత్ తెలిపారు. ఆ పాఠశాలలో 500 మంది బాలికలు ఉన్నారు.
ఈ మేరకు నాసిక్ జిల్లా అదనపు కలెక్టర్, టీడీడీ ప్రాజెక్ట్ అధికారి వర్షా మీనా బుధవారం పాఠశాలలో బాలికను కలుసుకుని సమస్య గురించి ఆరా తీశారు. పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు నాటడం వల్ల గత ఏడాది మొక్కలు ఎదగలేదని, అందుకని ఇప్పుడు అలాంటి అమ్మాయిలు మొక్కల దగ్గరకు వెళ్లొదని టీచర్ చెప్పారని ఆ అమ్మాయి తెలియజేసింది. శ్రమజీవి సంఘత్నా జిల్లా కార్యదర్శి భగవాన్ మాధేను సంప్రదించి, ఫిర్యాదు చేశానని వెల్లడించింది.
ఈ మేరకు జూలై 26న బాలికతో కలిసి నాసిక్లోని ఆదివాసీ వికాస్ భవన్కు వెళ్లి సంబంధిత ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా తాను గోలాయిత్తో ఫోన్లో మాట్లాడానని, మెమోరాండం అందజేశానని మాధే కూడా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలలోని ఇతర సమస్యల గురించి తెలియజేశారు. అడ్మిషన్ కోసం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ (యూజీపీ)ని కూడా పాఠశాల తప్పనిసరి చేసిందని, అయితే అలాంటి నిబంధన ఏదీ లేనప్పటికీ విద్యార్థులే ఖర్చు భరించేలా చేశారని ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa