ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన టిడ్కో గృహాలకు దిష్టి చుక్కలు మీ శిలాఫలకాలు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 01:21 PM

తెలుగుదేశం ప్రభుత్వంలో లక్షలాది టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేశాం. దాదాపుగా పూర్తి అయిన నిర్మాణాలను లబ్దిదారులకు అందించడానికి ఈ ప్రభుత్వానికి మూడేళ్ళ సమయం కూడా సరిపోలేదు అని అచెం నాయుడు తెలిపారు.  


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆ ఇళ్ళను లబ్దిదారులకు అందిస్తే చంద్రబాబు నాయుడు కి, టీడీపీ కి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో ఇన్నాళ్ళూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. 


మూడేళ్ళ కాలంలో వీళ్ళు చేసింది ఏమిటి అంటే, మా ప్రభుత్వంలో నిర్మితమైన గృహాలకు తమ పార్టీ రంగులు వేసుకోవడం, తమ శిలాఫలకాలు పెట్టుకోవడం. గృహ నిర్మాణాలకు అంటూ ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్లలో నిర్మించిన PMAY ఇళ్ళు కేవలం 5 మాత్రమే అని గత ఆగస్టులో పార్లమెంట్ సాక్షిగా తెలిపారు.  


మరి అప్పుగా తెచ్చిన 7,000 కోట్లు ఏమయిపోయాయి? ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే మన ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను చూపించి మరో 4,000 కోట్ల అప్పు కోసం వీళ్ళు ప్రయత్నించడం.


కేవలం టిడ్కో ఇళ్ళు మాత్రమే మన ప్రభుత్వంలో 4,600 కోట్ల ఖర్చుతో మూడు లక్షల ఇరవై వేల ఇళ్ళు నిర్మించడం జరిగింది. 


సెంట్ పట్టాలు, ఉచిత ఇళ్ళు అంటూ ప్రజలను నట్టేట్లో ముంచారు. వర్షాకాలం వచ్చిందంటే జగన్ రెడ్డి పంచిన పట్టాలు చెరువులుగా మారుతున్నాయి. ఉచితం అనేది పెద్ద బూటకం. ఇప్పుడు సొంత డబ్బులతో, బ్యాంక్ లోన్ ద్వారా మీరే నిర్మించుకోండి అంటూ అధికారులు లబ్దిదారులను ఒత్తిడి చేస్తున్నారు. 


లబ్ధిదారులకు గృహాలు కేటాయించక ముందే, EMI లు అంటూ బ్యాంక్ లు వీళ్ళ ఖాతాల్లోని సొమ్ములను లాగేస్తున్నాయి. అమ్మఒడి కి డబ్బులు వేశాం అని ప్రభుత్వం చెప్పడం, ఆ డబ్బు EMI పేరుతో బ్యాంక్ లు తమ ఖాతాల్లో జమ చేసుకోవడం మరీ దారుణం. 


ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే 90% వరకూ పూర్తి అయి ఉన్న ఈ ఇళ్ళను పూర్తి చేసి లబ్దిదారులకు అందించి ఉంటే లక్షలాది కుటుంబాలకు కరోనా కష్ట కాలంలో ఊరట దక్కేది. తన తుగ్లక్ నిర్ణయాలతో వీటిని గాలికి వదిలేసి, ఇళ్ళ స్థలాల కొనుగోలు అంటూ కొత్త స్కాం కు తెర తీశారు. పనికి రాని భూములను మూడు నాలుగు రెట్ల అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించి వైకాపా నాయకులు మూటలు వెనకేసుకున్నారు. 


మొత్తంగా రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అందరూ మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అని కోరుతున్నాను. 


చివరిగా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు ఎవరో గూగుల్ సహాయం లేకుండా ప్రజలు మీరు చెప్పగలరేమో చూడండి అని సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa