దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలేనని, వివిధ వర్గాలకు చెందిన ప్రజలంతా నా వాళ్లే అనుకునే ఆప్యాయత మనలో కలగాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 'భారత్@2047: మై విజన్ మై యాక్షన్' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎంతో భిన్నత్వం ఉందని, ఇంతటి వైవిధ్యాన్ని సమర్థంగా నెట్టుకొస్తున్న తీరు పట్ల భారత్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోందని అన్నారు. ఈ ప్రపంచం పూర్తిగా వైరుధ్యాలతో నిండి ఉందని, అయితే పరస్పర భిన్న అంశాలను ఎలా నిర్వర్తించాలన్న దానికి భారతదేశమే కేంద్రస్థానం అని కీర్తించారు.
అంతేకాదు, మనకు తెలియని, ఎవరూ సరిగ్గా బోధించని అనేక చారిత్రక సంఘటనలు ఉన్నాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. "ఉదాహరణకు సంస్కృత వ్యాకరణం భారత్ లో ఉద్భవించినది కాదు... ఎందుకలా అని మనం ఏనాడైనా ప్రశ్నించామా?" అని అన్నారు. "ప్రధానంగా చెప్పాలంటే... మొదట మనం మన మేధస్సును, విజ్ఞానాన్ని మర్చిపోయాం. ఆ తర్వాత ఉత్తర-పశ్చిమ దిక్కుల నుంచి వచ్చిన విదేశీ చొరబాటుదారులు మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం మరో కారణం" అని మోహన్ భగవత్ వివరించారు.
"మనం కులాలు, తదితర సారూప్య వ్యవస్థలకు అనవసర ప్రాధాన్యత ఇచ్చాం. పని కోసం ఏర్పడిన ఈ వ్యవస్థలు సమాజాలు, మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. మనకు భాష, వేషధారణ, సంస్కృతులు వంటి అంశాల్లో చిన్నపాటి తేడాలు ఉండొచ్చు. అయితే ఇలాంటి స్వల్ప భేదాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విశాల హృదయాన్ని అలవర్చుకోవాలి. దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలేనని, వివిధ వర్గాలకు చెందిన ప్రజలంతా నా వాళ్లే అనుకునే ఆప్యాయత మనలో కలగాలి"అని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa