ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 8న 'ది రాజా సాబ్' 'పెయిడ్ ప్రీమియర్ షోలు'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 06:26 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజా సాబ్' విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి, ఒక రోజు ముందుగానే అంటే జనవరి 8న 'పెయిడ్ ప్రీమియర్ షోలు' వేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అయితే, తెలంగాణలో ఈ ప్రీమియర్ షోల అనుమతులు, టికెట్ ధరల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిత్ర నిర్మాతలు లేఖ రాసినట్లు సమాచారం. అందులో మల్టీప్లెక్స్ టికెట్ ధరను రూ. 1,000గా, సింగిల్ స్క్రీన్ ధరను రూ. 800గా ప్రతిపాదించారు. భారీ డిమాండ్ దృష్ట్యా ఈ ధరలను కోరినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే సాఫీగా అనుమతులు లభిస్తుండగా, నిజాం (తెలంగాణ) రీజియన్‌లో మాత్రం కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల బెనిఫిట్ షోలపై స్పష్టత రావాల్సి ఉంది.భారత్‌లో బుకింగ్స్ ఇంకా ఊపందుకోకముందే, ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభాస్ తన సత్తా చాటుతున్నారు. ఒక్క నార్త్ అమెరికాలోనే ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 3.5 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.9 కోట్లు) వసూలయ్యాయి. ఇప్పటికే 1,045కు పైగా స్క్రీన్లలో 10,500 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైపోయాయి. ఈ జోరు చూస్తుంటే ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa