ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌ బాబు స్పెషల్ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 05:50 PM

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆమె 54వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ‌ పెట్టిన ఈ పోస్ట్, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.నమ్రత ఫొటోను షేర్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే ఎన్ఎస్‌జీ... అన్నీ ఎంతో గ్రేస్, ప్రేమతో చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు... ఇంతకంటే ఏమీ కోరుకోలేను" అని మహేశ్‌ రాశారు. ఈ పోస్ట్‌కు కామెంట్ల రూపంలో అభిమానులు, పలువురు ప్రముఖులు నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.2000వ సంవత్సరంలో 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో మహేశ్‌, నమ్రత మొదటిసారి కలుసుకున్నారు. ఆ సినిమాలో వారిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి 2006లో గౌతమ్, 2012లో సితార జన్మించారు. ఈ జంట తరచూ తమ కుటుంబ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు.ఇక సినిమాల విషయానికొస్తే, మహేశ్‌ బాబు ఆమధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' (2024) చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రానున్న 'వారణాసి'లో న‌టిస్తున్నారు.ఈ సినిమా గురించి మహేశ్‌ మాట్లాడుతూ.. "ఇది నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. దీనికోసం నేను చాలా కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా డైరెక్టర్‌ను గర్వపడేలా చేస్తాను. 'వారణాసి' రిలీజ్ అయ్యాక, భారతదేశం మనల్ని చూసి గర్వపడుతుంది" అని అన్నారు. ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa