పెను సంచలనంగా మారి.. మీడియాకు ఒళ్లు నొప్పులు తెచ్చేట్లుగా పని పెట్టిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. డ్రగ్స్ కేసులో తాజాగా ఇచ్చిన క్లీన్ చిట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నాలుగేళ్ల క్రితం సంచలనంగా మారటమే కాదు.. మీడియాలో హెడ్ లైన్స్ లో దర్శనమిచ్చిన ఈ కేసుకు సంబంధించి తాజాగా అధికారులు అనూహ్య ప్రకటనను విడుదల చేశారు. మత్తుమందుల కేసులో టాలీవుడ్ ప్రముఖులకు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ ఇస్తూ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఎపిసోడ్ లో మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ.. అప్పట్లో సినీ ప్రముఖులు పలువురిని విచారించింది. అయితే.. ఏ ఒక్కరి మీద కూడా ఆరోపణలు నిజమని తేల్చకపోగా.. అందరికి క్లీన్ చిట్ ఇచ్చేసింది.
సినీ ప్రముఖులు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా? లేదా? అని తేల్చాలంటే వారి రక్తం.. గోర్లు.. వెంట్రుకలు లాంటి నమూనాల్ని ఇవ్వాల్సి ఉంుటంది. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ప్రత్యేక పరీక్ష చేస్తారు. అయితే.. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ప్రకారం అనుమానితుల నమూనాలు సేకరించాలంటే.. అందుకు వారి స్వచ్ఛంద అనుమతి తప్పనిసరి. ఈ నిబంధన ఆధారంగా పలువురు ప్రముఖులు నమూనాల్ని ఇవ్వలేదు.
దర్శకుడు పూరి జగన్నాథ్.. నటుడు తరుణ్ లు మాత్రం స్వచ్ఛందంగానే తమ నమూనాల్ని ఇచ్చారు. దీనికి సంబంధించి రిపోర్టు ఆలస్యమైంది. ఈ నివేదిక తాజాగా తమ వద్దకు వచ్చిందని.. పూరి.. తరుణ్ లు ఇద్దరు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా.. ఎలాంటి ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది.దీంతో మొత్తం 12 కేసుల్లో సినీ ప్రముఖులకు ఎలాంటి ప్రమేయం లేదని తేలింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మనీలాండరింగ్ ఇష్యూలో ప్రస్తుతం విచారణ జరుపుతున్న ఈడీ మరెలా జరుపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఎక్సైజ్ కేసులో లేని రానా.. రకుల్ ప్రీత్ సింగ్ లను ఈడీ విచారణ చేయటం తెలిసిందే. అప్పట్లో కేసులో లేని పేర్లు ఇప్పుడే ఎలా వచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఎక్సైజ్ కేసులో క్లీన్ చిట్ అంటే.. ఈడీ ఎపిసోడ్ లోనూ అదే జరగనుందా? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. మరి.. ఈడీ ఎలాంటి రిపోర్టు ఇస్తుందో చూడాలి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ వ్యవహారం చూస్తే.. కొండను తవ్వి ఎలుకను కాదు కదా.. దాని నీడను కూడా చూపించలేకపోయారని చెప్పక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa