విలన్ గా... హీరోగా... కేరక్టర్ ఆర్టిస్టుగా అజయ్ కి మంచిపేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'పొట్టేల్' ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది. సాహిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, యువచంద్ర - అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రలను పోషించగా, ప్రతినాయకుడి పాత్రలో అజయ్ నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించాడు. "విక్రమార్కుడులో విలన్ గా రాజమౌళి గారు నన్ను ఎలా చూపించారనేది అందరికి తెలుసు. ఆ తరువాత చేసే విలన్ పాత్రలు ఆ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఒప్పుకోలేదు. ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు... సాఫ్ట్ రోల్స్ తో కూడిన ముఖ్యమైన పాత్రలు చేస్తూ వెళ్లాను. ప్రతి ఫేజ్ లోను నన్ను నేను కొత్తగా చూపించుకోవడానికి ఫైట్ చేస్తూనే వస్తున్నాను. మంచి రోజుల కోసం... మంచి రోల్స్ కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పాడు. "విక్రమార్కుడు కంటే భయంకరమైన విలనిజం ఏముంటుంది? అందువలనే మళ్లీ అలాంటి రోల్స్ పడలేదు. మళ్లీ ఇంతకాలానికి 'పొట్టేల్' సినిమాలో కుదిరింది. 1980కి ముందు గ్రామీణ ప్రాంతాల్లోని పటేల్ వ్యవస్థ, అప్పుడు జరిగిన అరాచకాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో నా విలనిజం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పాత్రను తెరపై చూసేవారు, వీడిని చంపేయాలి అనుకుంటారు. 'విక్రమార్కుడు' స్థాయి విలనిజాన్ని పండించే అవకాశం చాలా కాలం తరువాత వచ్చినందుకు హ్యాపీగా ఉంది" అని అన్నాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa