హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీపై కేసు నమోదైంది. శనివారం (నవంబర్ 4) సాయంత్రం ఆమె ఓ యాక్సిడెంట్ చేసింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శివాని నడుపుతున్న ఏపీ 13ఈ 1234 నంబర్ కారు జూబ్లీహిల్స్ రోడ్డు నం.73 నవనిర్మాణనగర్ మలుపు వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్పీడ్ బ్రేకర్ను దాటే క్రమంలో ఆమె కారును అదుపు చేసుకోలేక పక్కనే నిలిపి ఉంచిన మరో కారును బలంగా ఢీకొట్టింది. సదరు కారు ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న జీవిత, రాజశేఖర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. రాజీ కుదర్చుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో బాధితులు సోమవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు.
హీరో రాజశేఖర్.. ఇటీవలే తన తల్లి మరణించిందన్న బాధలో నిద్రమాత్రలు మింగి యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్ని రోజులు కూడా గడవకముందే మరోసారి యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకోవడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది. గరుడవేగ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. రాజశేఖర్ కుటుంబం ఈ ఉదంతంతో కాస్త నైరాశ్యంలో కూరుకుపోయింది.
సదరు పారిశ్రామికవేత్త తాను రెండు వారాల కిందటే రూ. 30 లక్షలు వెచ్చించి ఆ కారును కొన్నానని చెబుతున్నారు. తనకు నష్టపరిహారంగా రూ. 30 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa