‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయకుడు పి. జయచంద్రన్ (80) (P Jayachandran) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన త్రిశ్శూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన జయచంద్రన్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన తెలుగులో పాడిన పలు పాటలు హిట్గా నిలిచాయి. రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), హ్యాపీ హ్యపీ బర్త్డేలు (సుస్వాగతం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి) వంటి సాంగ్స్ విశేష ఆదరణ పొందాయి. తెలుగులో ఆయన పాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ (ఊరు మనదిరా) చివరి పాట 2002లో విడుదలైంది.1986లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు (శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకుగానూ), 5 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులూ ఆయన్ను వరించాయి. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎం.ఎం. కీరవాణి, విద్యా సాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో ఆయన పాటలు పాడారు. మలయాళ సినిమాలు ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa