ప్రభాస్ అంటే స్నేహం, ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యానికి మరో పేరు. ఆయనకు మరో ట్యాగ్ కూడా ఉంది. రకరకాల వంటలతో భోజనం పెట్టి మరీ ప్రేమతో చంపేస్తాడని ఆయన సన్నిహితులు ఎంతో గొప్పగా చెబుతుంటారు. నిజమే.. ప్రభాస్ ఇంటికి ఎవరు వెళ్లినా అతిథ్యం ఓ రేంజ్లో ఉంటుంది. గోదావరి వంటకాలన్నీ అతిథి ముందు సిద్ధంగా ఉంటాయి. ఆయన ఇంటి భోజనం తిన్న ఎంతోమంది ప్రభాస్ ప్రేమనే కాదు.. భోజనాన్ని తట్టుకోలేం అని చెబుతుంటారు. ఇప్పుడు ఇదే ఫీలింగ్లో హీరోయిన్ ఇమాన్వీ ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోందీ బ్యూటీ. ఆమె కోసం ప్రభాస్ ప్రత్యేకంగా భోజనం పంపించారు. అందులో వెజ్, నాన్వెజ్ వంటకాలతో చాలా రకాలు పంపించారు. వాటిని రుచి చూసిన ఇమాన్వీ ఈ భోజనం ఎంతో టేస్ట్గా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇమాన్వి తాజాగా ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. రుచికరమైన భోజనాన్ని పంపించిన ప్రభాస్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు.. తన కోస్టార్స్ అందరికీ సెట్లో స్టాఫ్తో సహా ఆయన ఇలా భోజనం పంపి సర్ప్రైజ్ చేస్తుంటారు. దీపికా పదుకొణె, కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి హాసన్, శ్రద్ధా కపూర్, నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ వంటి తారలు ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసినవారే. ఫౌజీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి అదే వర్కింగ్ టైటిల్గా ఉంది. ఇక హీరోయిన్ ఇమాన్వీ విషయానికొస్తే.. హిందీతోపాటు, తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో అలరించాయి. సుమారు 8 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa