ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన వరల్డ్ టూర్ను ప్రారంభించనున్నారు. ఈ సంగీత ప్రయాణం మే 3న ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 'వండర్మెంట్' పేరుతో జరగనున్న ఈ వరల్డ్ టూర్లో రెహమాన్ తన మేజికల్ మ్యూజిక్ ను ప్రపంచవ్యాప్తంగా వినిపించనున్నారు. ముంబైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెహమాన్ మాట్లాడుతూ.. "ముంబై నగరానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఇది ఎప్పుడూ నన్ను స్ఫూర్తినిస్తుంది. నా వరల్డ్ టూర్ ఇక్కడి నుంచే మొదలు కానుండడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు. అంతేకాదు, ఈ టూర్లో తనతో పాటు ఎంతోమంది ప్రఖ్యాత గాయకులు కూడా పాల్గొనబోతున్నారని తెలిపారు.ఇటీవల రెహమాన్ డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న ఆయన, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అభిమానుల ఆశీస్సులతో మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు.భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఏఆర్ రెహమాన్.. తన సంగీతంతో దేశానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందించారు. ఆయన సాధించిన విజయాలు, చేసిన సేవలకు గుర్తుగా ఈ టూర్ను ఘనంగా నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.రెహమాన్ తమిళం, హిందీ సినిమాల్లో తన సంగీతంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక బాఫ్టా అవార్డు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆరు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 18 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. 2010లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa