ప్రముఖ తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తిల విడాకుల కేసు చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు వచ్చింది. ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు.విచారణ సందర్భంగా, ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు న్యాయస్థానం కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించింది. అయితే, ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి స్పష్టం చేసినట్లు సమాచారం. విడాకులు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోసం పిటిషన్ వేశారు. అనంతరం, న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.తాము విడిపోతున్నట్లు గత ఏడాది జయం రవి ప్రకటించారు. అయితే, తనను సంప్రదించకుండానే రవి ఈ విషయం బయటపెట్టారని ఆర్తి ఆరోపించారు. గాయని కెనీషాతో జయం రవికి ఉన్న స్నేహం వల్లే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, అందుకే విడాకులు తీసుకుంటున్నారని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి రవి, కెనీషా కలిసి హాజరుకావడం ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది.మరోవైపు, 18 ఏళ్ల వైవాహిక జీవితంలో తన భర్త బాధ్యతలు మరిచారని ఆర్తి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల కోసమే తాను పోరాడుతున్నానని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, ఆర్తి తనను మానసికంగా, ఆర్థికంగా నియంత్రిస్తోందని జయం రవి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్తి, తాము విడిపోవడానికి ఓ మూడో వ్యక్తే కారణమని, అందుకు తన వద్ద ఆధారాలున్నాయని సోషల్ మీడియాలో నిన్న మరో పోస్ట్ పెట్టారు. ఇకపై తాను మాట్లాడనని, న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa