by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:35 PM
విజయనగరం జిల్లాలోని పిరిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వ హణ తీరుపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు, ఇద్దరు ఎంఈఓలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపు వాసులు విచారణ చేపట్టారు. తొలుత పాఠశాలలో హెచ్ఎం మధుసూదనరావు, సిబ్బంది, భోజన నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించి ఆరా తీశారు. వంటగ్యాస్ మధ్యలో అయిపోవడంతో రెండుసార్లు వంట వండాల్సి వచ్చిందని, ఆ కారణంగానే తొలివిడతలో కొంతమంది విద్యార్థులకు భోజనం అందలేదని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని హెచ్ఎం సంజా యిషీ ఇచ్చారు. అనంతరం వంటలను, తయారుచేసిన భోజనాలను డిప్యూటీ డీ ఈవో పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు సరిపడా సక్రమంగా అందించాలని హెచ్ఎంను, భోజన నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం సుమారు 60 మంది విద్యార్థులకు భోజనం అందకపోయిన అంశానికి సంబంధించి రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని హెచ్ఎంకు, నిర్వాహకురాలికి నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు. నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పిస్తామని ఆయన తెలిపారు.
Latest News