by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:57 PM
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రాణాంతక కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడ్డప్పుడు డాక్టర్లు చేసిన సేవలు విస్మరించలేనివని అన్నారు. మన దేశంలో దాదాపు 1600 మంది వైద్యులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణను చూపించాలని, అదే విధంగా రోగులు సైతం వైద్యులపట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని సూచించారు. అటు వైద్యులు, ఇటు రోగులు పరస్పరం గౌరవపూర్వకమైన భావనను పెంపొందించుకోవాలన్నారు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో వైద్యులపైనా, ఆసుపత్రులపైనా దాడులు చోటు చేసుకొంటున్నాయని, ఇటువంటి అవాంఛనీయమైన ఘటనల నుంచి రక్షణ అవసరమని వైద్య నిపుణులు కోరుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అంశాన్ని, వైద్య వృత్తిలో ఉన్నవారికి రక్షణ ఇస్తున్న చట్టం అమలు విషయాన్ని రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.
Latest News