by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:37 PM
ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు వాగు కుంటలో పడి మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పువీరాయపాలెంలో గత నెలలో ఆంజనేయస్వామి తిరునాళ్ల జరిగింది. సంప్రదాయం ప్రకారం నెలరోజులకు పొంగళ్లు పెట్టి మొక్కు తీర్చుకుంటారు. అందులోభాగంగా గ్రామంలో ఆదివారం నెల పొంగళ్ల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ బంధువులను పిలుచుకున్నారు. అందులోభాగంగా ఎస్సీ కాలనీకి చెందిన గర్నెపూడి ప్రసాద్ కుమార్తెలు, మనుమళ్లు కూడా గ్రామానికి చేరుకున్నారు. తాతయ్య ఇంటికి వచ్చిన పొదిలి మండలం ఏలూరుకు చెందిన ధర్నాశి వీరమణికంఠ (10), అద్దంకి మండలం వేలమూరిపాడుకు చెందిన పులి రాఘవేంద్ర(10) ఆదివారం ఉదయం ఊరి పక్కనే ఉన్న వాగు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. వాగులో నీటి అవసరాల కోసం కుంట తీయగా, అందులో సంవృద్ధిగా నీరు చేరింది. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం కుంట వద్దకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. అదేసమయంలో అక్కడికి వెళ్లిన మరో బాలుడు చూసి పరుగెత్తుకుంటూ గ్రామంలోకి చేరుకొని కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో వారు కుంటలోకి దిగి గాలింపు చేపట్టగా ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు బయటపడ్డాయి. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబసభ్యుల రోదన వర్ణణాతీతమైంది. గ్రామంలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి. ఈ ఘటనతో నెల పొంగళ్లను సాదాసీదాగా నిర్వహించి పూర్తిచేశారు.
Latest News